Saturday, May 16, 2015

మొబైల్ బ్యాంకింగ్ జాగ్రత్తలు పాటిస్తున్నారా


అందుబాటులోకొచ్చిన సాంకేతిక పరిజ్ఞానం బ్యాంకు సేవలు, వివిధ బిల్లుల చెల్లింపుల్ని కూడా మరింత సులభతరం చేసింది. అందుకే ఇప్పుడు చాలామంది స్మార్ట్ ఫోన్ యూజర్లు తమ మొబైల్ నుంచే అన్ని ట్రాన్సాక్షన్లు జరిపేస్తున్నారు. అయితే అలా తమ స్మార్ట్‌ఫోన్‌తో మొబైల్ బ్యాంకింగ్ చేసే వాళ్లంతా తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకుంటే మంచిదంటున్నారు సైబర్ ఎక్స్‌పర్ట్స్. లేదంటే మీ జేబుకు చిల్లు పడటం ఖాయం అని హెచ్చరిస్తున్నారు. అందులో నిపుణులు సూచిస్తున్న కొన్ని ఇంపార్టంట్ టిప్స్ ఇలా వున్నాయి. ఈమధ్య కొన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు వారి సోషల్ మీడియా కాంటాక్ట్సులో వుండేవారికి కూడా మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు వీలు కల్పించాయి. ఇటీవలే పింగ్‌పే పేరిట యాక్సిస్ బ్యాంక్ ఓ అప్లికేషన్‌ని ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా ఫేస్ బుక్, వాట్సాప్, ట్విటర్, ఎస్ఎంఎస్, ఈమెయిల్... వీటన్నింటిలో వున్న కాంటాక్ట్సులో ఎవరికైనా మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకునే వీలుంటుంది. సరిగ్గా ఇదే తరహాలో కోటక్ మహీంద్రా కూడా కేపే, పాకెట్స్ యాప్స్ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ సేవలందిస్తోంది. అయితే ఇటువంటి యాప్స్ వాడకం విషయంలో కస్టమర్లు తగిన జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటూ ఈమధ్యే హెచ్చరికలు జారీచేసింది ఆర్బీఐ. ఏప్రిల్‌లో విడుదలైన ఓ యాప్‌ని దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ ఈ హెచ్చరికలు చేసింది. మీ అన్ని బ్యాంకుల ఎకౌంట్లలోని బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చునంటూ ఆర్బీఐ లోగోతో కూడిన ఓ యాప్ ఏప్రిల్‌లో మార్కెట్‌లోకొచ్చింది. అయితే దీనికీ, తమకు ఏ విధమైన సంబంధం లేదని... దాని వాడకం ద్వారా తలెత్తే సమస్యలకు ఆర్బీఐ బాధ్యత వహించబోదంటూ ఈ హెచ్చరికల్లో పేర్కొంది ఆ సంస్థ. అచ్చం ఒరిజినల్ బ్యాంక్ యాప్స్‌లాగే కనిపిస్తున్న కొన్ని ఫేక్ మాల్‌వేర్ యాప్స్ కూడా ఇంటర్నెట్‌లో అందుబాటులో వున్నాయని, అవి డౌన్‌లోడ్ చేసి వాడితే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదంటోంది ఆర్బీఐ. వివిధ బ్యాంకులు అందిస్తున్న ఒరిజినల్ జెన్యూన్ యాప్స్‌ని వాడితే పర్వాలేదు కానీ ఏదీపడితే అది మాత్రం వాడకండని అప్రమత్తం చేస్తున్నారు ఎక్స్‌పర్ట్స్. విశ్వసనీయతలేని ఫేక్ యాప్స్‌ని వాడటం వల్ల మీ ఎకౌంట్ యూజర్ ఐడీ, లాగిన్ ఐడీ, పర్సనల్ డీటేల్స్ హ్యాకర్స్‌కి తెలిసిపోవడంతోపాటు మీ సొమ్ము చోరికి గురయ్యే ప్రమాదం వుందని అలెర్ట్ చేస్తున్నారు బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న సెక్యురిటీ వింగ్ సైబర్ ఎక్స్‌పర్ట్స్.

Friday, May 15, 2015

మగాడు మహేష్‌బాబు


మహేష్‌బాబు కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీస్ పతాకంపై వై.నవీన్, రవిశంకర్, సి.వి.మోహన్ నిర్మిస్తున్నారు. శృతిహాసన్ కథానాయిక. జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి శ్రీమంతుడు అనే టైటిల్ ప్రచారంలో వుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు మగాడు అనే టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో చిత్ర బృందం వున్నట్లు తెలిసింది. షూటింగ్ ఆరంభం నుంచి ఈ చిత్రానికి శ్రీమంతుడు అనే టైటిల్‌తో మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. తాజాగా టైటిల్ మార్పునకు చిత్ర వర్గాలు సిద్ధపడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ చిత్ర టైటిల్ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. కుటుంబ అనుబంధాలు, సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో మహేష్‌బాబు పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో వుంటుందని, యాక్షన్‌కు కూడా ప్రాధాన్యత వుందని చిత్ర బృందం చెబుతోంది. ఇందులో పూర్ణ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. రాజేంద్రప్రసాద్, సుకన్య, ఆమని, సంపత్‌రాజ్, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు. జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

చిరంజీవి సరసన ఆ 'తార' కాదట ..


టాలీవుడ్ లో ఇప్పుడు అందరి కళ్లు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంపైనే. పూరీ దర్శకత్వంలో వచ్చే సినిమా అంటేనే హిట్టే అని ప్రేక్షకులు ఓ అంచనాకు వస్తారు. అయితే ఇంతకీ చిరంజీవి సినిమా స్టోరీ ఏంటి ? అది మాస్... క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? అనే ప్రశ్నలు ఇప్పటికే ఆయన అభిమానులు మనస్సులను తొలి చేస్తున్నాయి. అలాగే చిరంజీవి సరసన నటించే హీరోయన్ మాత్రం ఎవరనేది అభిమానులకు తెలియక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఈ సినిమాలో టాలీవుడా లేక బాలీవుడ్ హీరోయిన్ కు ఛాన్స్ ఇస్తారా? అని ఎవరికీ వారు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే చిరంజీవి 150వ చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ నయనతార కొట్టేసిందంటూ టాలీవుడ్ లో ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే ఈ వార్తలను పూరీ సన్నిహితులు మాత్రం కొట్టిపారేశారు. అవన్ని ఒట్టి పుకార్లే అని వారు పేర్కొన్నారు. ఆ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం ఇంతవరకూ నయనతారతోనే కలసి చర్చించనే లేదని వారు స్పష్టం చేశారు. చిరంజీవి చిత్ర కథపై దర్శకుడు పూరీ గట్టిగా కసరత్తు చేస్తున్నాడని... కథను రూపొందించడంలో నిమగ్నమైన పూరీ ఇంకా చిరంజీవి సరసన హీరోయిన్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదని సన్నిహితుల భోగట్టా. దాంతో చిరంజీవి సినిమాలో హీరోయిన్ నయన తార కాకుంటే ఇంకా ఎవరబ్బా అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మోదీ చైనా పర్యటనలో బిజీగా


ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనలో బిజీగా ఉన్నారు. అయితే..ఆయన అక్కడ ఉండగానే..జియాన్ సిటీలో..చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్‌‌తో చర్చలు జరుపుతుండగానే అక్కడి ప్రభుత్వ ఆధ్వర్యంలోని టీవీలో భారత్‌‌కు సంబంధించి ఓ మ్యాప్ చూపారు. అందులో జమ్మూ కాశ్మీర్ గానీ, అరుణాచల్‌ప్రదేశ్ గానీ కనిపిస్తే ఒట్టు. ఆ రెండూ లేకుండానే మ్యాప్ ప్రదర్శించారు. మోదీ పర్యటనకు సంబంధించి ఆ టీవీ రిపోర్టింగ్ చేస్తున్న సందర్భంగా ఈ ఉదంతం చోటు చేసుకుంది. అరుణాచల్ తమదేనని, అది తమ దేశంలో అంతర్భాగమేనని, అలాగే జమ్మూ కాశ్మీర్‌‌లో కొన్నిభాగాలు కూడా తమవేనని చైనా వాదిస్తోంది. కానీ భారత్ ఈ వాదనను తీవ్రంగా ఖండిస్తోంది. ఈ సరిహద్దు సమస్య భారత, చైనాల మధ్య ఎడతెగని పీటముడిగా మారింది. ఇప్పటివరకు దీనిపై ప్రతినిధుల స్థాయిలో 18 సార్లు చర్చలు జరిగాయి. మరి మ్యాప్‌‌లో అరుణాచల్, జమ్మూ కాశ్మీర్ లేని అంశంపై మోదీ చైనా నేతలతో చర్చిస్తారా లేక చూసీ చూడనట్టు వ్యవహరిస్తారా అన్నది తేలాల్సి ఉంది

రామ్‌చరణ్ ‘బ్రూ‌స్ లీ’


‘గోవిందుడు అందరివాడేలే’ రిలీజై 9 నెలలు కావస్తున్నా.. రామ్‌చరణ్ తన నెక్స్ట్ మూవీ సెట్స్‌కు ఇంకా వెళ్ళలేదు. శ్రీను వైట్లతో చేసే సినిమా స్టోరీ కోసం పక్కా స్క్రీన్‌ప్లే, కాస్టింగ్ కోసం ఆలస్యమైంది. ఈ నెలాఖరు నుండి సెట్స్‌కు వెళ్తోందని టాక్. 
తొలుత ఈ మూవీకి ‘మై నేమ్ ఈజ్ రాజు’ అనే టైటిల్ ప్రచారం‌లో ఉండగా, ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టైటిల్ సీన్‌లోకి వచ్చింది. ఇందులో చెర్రీ స్టంట్ మాస్టర్ రోల్ చేస్తున్నాడని, దీనికి ‘బ్రూ‌స్ లీ’ అనే పేరు ఫిక్సయ్యే చాన్స్ ఉందని లేటెస్ట్‌ న్యూస్. ఈ రోల్ కోసం బ్యాంకాక్‌లో కొన్నాళ్ళు ఫిట్‌నెట్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇపుడు ఫ్లైట్స్, ఫిట్నెస్ బిజినెస్‌లతోపాటు చిరంజీవి 150 మూవీని కూడా నిర్మించే బిజీలోవున్నాడు. రాజు.. టైటిల్ కంటే బ్రూస్లీ టైటిల్ క్యాచీగా వుంటుందని చెర్రీని శ్రీను వైట్ల కన్విన్స్ చేసినట్టుగా తెలుస్తోంది.

కొత్త మార్గాల్ని ఎంచుకుంటోంది ప్రియాంక

కేవలం బాలీవుడ్ సినిమాలకే పరిమితమైపోకుండా అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకోవడానికి కొత్త మార్గాల్ని ఎంచుకుంటోంది ప్రియాంకచోప్రా. 
ఎగ్జోటిక్ అనే పాప్ ఆల్బమ్ ద్వారా గాయనిగా అమెరికా సంగీత ప్రపంచంలో మంచిగుర్తింపును సంపాదించుకున్న ఈ సుందరి తాజాగా ప్రఖ్యాత అమెరికా యాక్షన్ డ్రామా సిరీస్‌క్వాన్టికోలో కీలక పాత్రలో నటించింది. 

 అత్యంత జనాదరణ పొందిన ఈ సీరియల్‌లో ప్రియాంకచోప్రా నేర పరిశోధనాధికారిణిగా (ఎఫ్‌బీఐ ఏజెంట్) ఛాలెంజింగ్ పాత్రను పోషించింది. ఇటీవలే ఈ షో తాలూకు మూడు నిమిషాల నిడివిగల ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో ప్రియాంక చోప్రా అభినయానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. 

పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమెను పొగడ్తలతో ముంచెత్తున్నారు. అమెరికాపై దాడిచేసిన టెర్రరిస్టులను వెతికిపట్టుకోవడానికి నియమించిన ఎఫ్‌బీఐ బృందంలో కీలకమైన అధికారిణిగా ప్రియాంకచోప్రా పాత్ర ఆసక్తికంగా వుంటుందని అభినందిస్తున్నారు. 

ఈ సీరియల్ తాలూకు ట్రైలర్‌ను ఒక్కరోజులోనే పది లక్షల మంది వీక్షించడం విశేషం. తాను తొలిసారిగా అమెరికన్ టెలివిజన్ రంగంలో అడుగుపెడుతూ చేసిన క్వాన్టికో సిరీస్‌కు అద్భుతమైన స్పందన రావడం ఆనందంగా వుందని, భారతీయ ప్రేక్షకుల ఆశీస్సులతో అమెరికా టెలివిజన్ రంగంలో మరిన్ని అవకాశాల్ని సొంతం చేసుకుంటానని ప్రియాంకచోప్రా ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ సుందరి హిందీలో బాజీరావు మస్తాని అనే చారిత్రక చిత్రంలో నటిస్తోంది.